న్యూదిల్లీ : భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వారిని స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్ గా అధికారులు గుర్తించారు. వీరి మృతికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంతాపం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగవలసి ఉంది.


