5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్


టెలఅవీవ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర పోరు కొనసాగుతోంది. తమ ఆపరేషన్ మరో రెండు వారాలు సాగుతుందని ఇజ్రాయిల్ సైన్యం సూచనప్రాయంగా తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నేటి వరకు ఇరాన్‌పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇరాన్ సైనికులు వేలాది మంది చనిపోయినట్లు వెల్లడించింది. తెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ స్థావరంపై ఇజ్రాయిల్ 100కు పైగా యుద్ధ విమానాలతో 250 బాంబులను జార విడిచింది. ఈ ప్రాంగణంలోనే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) కేంద్ర కార్యాలయం, ఐఆర్‌జీసీ కుద్స్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, ఇరాన్ సైబర్ యూనిట్, బసిజ్ పారామిలిటరీ ఫోర్స్ హెడ్‌క్వార్టర్ వంటి కీలక కార్యాలయాలు ఉన్నాయి. ఈ దాడుల్లో ఆ ప్రాంతం చాలా వరకు ధ్వంసమైంది. తెహ్రాన్ విమానాశ్రయంలోని డిటెక్షన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. ఎక్కడెక్కడ ఎవరు దాడులు చేయాలన్న దానిపై అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి లాంఛర్లపై అమెరికా దాడులు చేసింది. ఈ ప్రాంతం నుంచే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ గురి పెడుతున్నది. దీంతో అదే ప్రాంతాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుంది. కాగా, ఇరాన్‌పై దాడుల కోసం చేపట్టిన ఆపరేషన్ క్రమంలో వెయ్యి మందికి పైగా అమెరికన్ సిబ్బంది ఇజ్రాయిల్‌లో పనిచేస్తున్నారని సమాచారం.

The post 5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *