విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తిరిగి దర్శనాన్ని అనుమతిస్తామని వెల్లడించారు. గ్రహణ సమయాల్లో ఆలయ ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించడం జరుగుతుందని, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.


