చెన్నై: ప్రముఖ సినీ దర్శకులు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పైగా ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో నగరంలోని ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తన కుమారుడు మనోజ్ హఠాత్తుగా చనిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన భారతీరాజా… గత యేడాది డిసెంబరులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అనేక వదంతులు వ్యాపించడంతో ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి నేతృత్వంలో కమిటీ ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి, భారతీరాజా ఆరోగ్యంపై ఒక స్పష్టత ఇచ్చింది. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్న భారతీరాజా ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఆయనను చూసేందుకు ఎవరినీ అనుమతించకుండా, కుటుంబ సభ్యులు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. భారతీరాజా త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.


