విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక మార్లు ఆయనకు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ పోలీసులు బీహార్లోని పట్నాకు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందించి స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ఆయనను ఏపీకి తీసుకువచ్చి మంగళవారం గుంటూరు కోర్టులో హజరుపర్చనున్నారు. ప్రస్తుతం సునీల్ నాయక్ పట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆయన ఏపీ సీఐడీ డీఐజీగా డిప్యూటేషన్పై విధులు నిర్వహించారు.
The post ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ appeared first on Visalaandhra.


