విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి దస్తగిరిపై చర్యలు తీసుకోవాలని సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో లాయర్ అని చెప్పుకునే హనుమయ్య ఇంటి ముందు ఉన్న రోడ్డుపై అక్రమ కట్టడాలు కడుతున్నాడని తెలిపారు. తిమ్మారెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై హనుమయ్య రాజకీయ నాయకుల అండదండలతో రోడ్డుపై పశువులు కట్టేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఎక్కడైతే పేదలు ఇళ్ల నిర్మాణం జరుగుతాయో అక్కడికి వెళ్లి డబ్బులు ఇస్తే ఒక న్యాయం, ఇవ్వకపోతే ఒక న్యాయం చేస్తారన్నారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి చెప్పితే కుంటి సాకులు చెపుతూ హనుమయ్యకు వత్తాసు పలుకుతున్నాడని ఆరోపించారు. వీరిద్దరూ కలిసి గ్రామంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కావున అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి వీరేష్, నాయకులు తిమ్మారెడ్డి, లక్ష్మన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


