కోల్కతా: గత నెలలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికలపై అందరి దష్టి ఉంది. అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ…ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. పలుచోట్ల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్లను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను తారుమారు చేయాలని చూస్తే… చావునైనా లెక్క చేయకుండా పోరాడతానని హెచ్చరించారు. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ను మమత సందర్శించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్లను ఇక్కడే భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ…‘ఎవరైనా ఈవీఎం యంత్రాలను దొంగిలించడానికి, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయడానికి ప్రయత్నిస్తే…జీవన్మరణ పోరాటం చేస్తా’ అని అన్నారు. మరోవైపు…ఉత్తర కోల్కతాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను నేతాజీ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇక్కడ టీఎంసీ నేతలు ధర్నాకు దిగారు. బెంగాల్ మంత్రి శశి పాంజా, టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోశ్ నేతృత్వంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ అనంతరం ఈవీఎంల నిర్వహణలో భారీ లోపాలు జరిగాయని టీఎంసీ పేర్కొంది. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యాయని ఆరోపిస్తూ… ఒక వీడియోను విడుదల చేసింది. పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు లేకుండానే బ్యాలెట్ బాక్స్లు తెరుస్తున్నారని ఆరోపిస్తూ… సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను ఎక్స్లో పోస్టు చేసింది. దీంతోపాటు పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించింది.
The post బ్యాలెట్ బాక్స్లు తెరిచేందుకు కుట్రలు: తృణమూల్ appeared first on Visalaandhra.


