ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే… గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫోర్జరీ పత్రాలతో ఆరోపణలు చేశారన్నదే ఈ కేసు ప్రధానాంశం. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాంగణం నుంచే కీలకమైన పత్రాలు, సాక్ష్యాలు చోరీకి గురవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉదంతంపై అప్పట్లో హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ, ఈ కేసు విచారణను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని కోరారు.


