Last Updated:
Maha Shivaratri 2026 wishes: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువై ఉన్న పవిత్ర భూమి మన రాష్ట్రం. భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అని వేడుకున్నారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పవిత్ర పర్వదినం పరమభక్తి, ఆధ్యాత్మికతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ విశేషమైన ఆధ్యాత్మిక సాధనలని, అవి భక్తి నిష్ఠను ప్రతిబింబిస్తాయని జగన్ పేర్కొన్నారు. ఈ పర్వదినాన భక్తి శ్రద్ధలతో శివారాధన చేయడం ద్వారా మనసుకు శాంతి, ఆత్మకు పవిత్రత లభిస్తాయని తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఆలయం మన రాష్ట్రంలో కొలువై ఉండటం గర్వకారణమని ఆయన అభివర్ణించారు. శ్రీశైలం మల్లన్న స్వామివారి క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి నిలయమని కొనియాడారు. మహా శివరాత్రి రోజున ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణతో భక్తులు పరమశివుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరిపై పరమశివుడి అనుగ్రహం ఉండాలని, సుఖసంతోషాలు నెలకొనాలని కోరుకున్నారు.
ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివుడు భక్తసులభుడని, ఆయన కృపతో ప్రజల జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం నెలకొనాలని ప్రార్థించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తన సందేశంలో పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో శాంతి, సౌఖ్యం నిండాలని కోరుకున్నారు. మహా శివరాత్రి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు. మహా శివరాత్రి పర్వదినం భక్తి, విశ్వాసం, ఆత్మపరిశీలనకు మార్గదర్శకమని నేతలు అభిప్రాయపడ్డారు. శివార్చన, జాగరణలతో ఈ పవిత్ర రోజును భక్తిశ్రద్ధలతో జరుపుకుని, సమాజంలో సత్సంకల్పాలు పెంపొందించాలని వారు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



