రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ Prakhar Jain తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మొత్తం 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగనుండగా, ఎల్లుండి 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 94 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.4°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1°C, నెల్లూరు జిల్లా కొమ్మిపాడు, కాకినాడ జిల్లా కరపలో 43.6°C, కడపలో 43.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, నంద్యాల, శ్రీసత్యసాయి, పల్నాడు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా 42 నుండి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల జాబితా కూడా వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అధికారులు సూచిస్తున్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా ఉండాలని చెప్పారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, తగినంత మంచినీరు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించవచ్చని సూచించారు.
ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్ష సూచనలు కూడా ఉన్నాయి. మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్ష సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని, పిడుగుల ప్రమాదం నుంచి జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో వాతావరణం ఒకవైపు ఎండతో, మరోవైపు వర్షంతో ప్రజలను పరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


