పేదల నివాస ప్రాంతాలే లక్ష్యంగా మట్కా నిర్వహణ…
మట్కా మహమ్మారి కాటులో తాడిపత్రి పేదలు
ఆన్లైన్, వాట్సాప్లలో మట్కా నిర్వహణ.
విశాలాంధ్ర – తాడిపత్రి: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని మట్కా నిర్వాహకులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక్క రూపాయికి 90 రూపాయలు” అనే ఆశ చూపిస్తూ తాడిపత్రి పట్టణంలోని పేద ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన కూలీ డబ్బులను కూడా కుటుంబ అవసరాలకు వినియోగించకుండా, మట్కాలో పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పేద కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. మట్కా నిర్వాహకులు పేదల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి కష్టార్జిత డబ్బును దోచుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా ఆన్లైన్, వాట్సాప్ ద్వారా నంబర్లు పంపిస్తూ మట్కా నిర్వహణను మరింత విస్తరించారని తెలుస్తోంది. ఇది చాపకింద నీరులా వ్యాపిస్తూ పేదల జీవితాలను దెబ్బతీస్తోంది. సంబంధిత అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసి నిర్వాహకులను రిమాండ్కు పంపుతున్నప్పటికీ, వారు తిరిగి బయటకు వచ్చి మట్కా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని సమాచారం. గతంలో జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకుని మట్కా నిర్వాహకులను బహిష్కరించినప్పటికీ, తాడిపత్రిలో ఈ దందా పూర్తిగా ఆగలేదు. మట్కా మహమ్మారిని పూర్తిగా అరికట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నాయి.


