సింహాచలం: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఈ నెల 20న అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా సింహాచలం విరాజిల్లుతున్న నేపథ్యంలో, ఏడాది పొడవునా సుగంధ చందనంలో కొలువుండే స్వామి, వైశాఖ శుద్ధ తదియనాడు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా, చందనం అరగదీత కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవతో ఆరాధన గావించారు. ఉదయం 6:30 గంటలకు ఆలయ బాండాగారం వద్ద ప్రత్యేక వేదికపై విశ్వశ్వర పుణ్యహవచనం, ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసులు శిరస్సున చందనం పెట్టుకొని స్వామికి ప్రదక్షిణలు చేసి, తొలివిడత చందనాన్ని అరగదీసారు.
చందనోత్సవం రోజున భక్తులకు సహస్రఘటాభిషేకం, ఇతర పూజాది కార్యక్రమాల అనంతరం మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలలో మూడేసి మణుగుల చందనం సమర్పించే సంప్రదాయం ఉంది. స్వామి విగ్రహం 12 అడుగుల పుట్టలో లభించడంతో, 12 మణుగుల చందనంలో నిరంతరం కొలువులో ఉంటారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


