పంటల వారీగా నష్టం వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రధానంగా వాణిజ్య, ఆహార పంటలు భారీగా దెబ్బతిన్నాయి.
వరి, మొక్కజొన్న: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,840 హెక్టార్లలో వరి, 1,534 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మిర్చి, పసుపు: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 1 లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఇప్పుడు పెట్టుబడి సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదు. తడిసిన మిర్చి నల్లగా మారిపోతుండటంతో మార్కెట్లో ధర రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యానవన పంటలు (మామిడి, అరటి): కృష్ణ, ఎన్టీఆర్, తిరుపతి, కడప జిల్లాల్లో గాలివానల ధాటికి మామిడి పిందెలు రాలిపోయాయి. వందలాది ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి.
జిల్లాల వారీగా ప్రభావం: ఈ అకాల వర్షాల ప్రభావం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలపై పడింది.
కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలు: మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి.
నెల్లూరు, తిరుపతి: ఉదయగిరి, రాపూరు పరిసర ప్రాంతాల్లో వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఓజిలి మండలంలో 700 ఎకరాల్లో అరటి తోటలు నాశనమయ్యాయి.
ఉత్తరాంధ్ర: విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీ గాలులతో కూడిన వర్షం పడటంతో సాధారణ జనజీవనం స్తంభించడమే కాకుండా, పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.
అప్పులు చేసి, ఎంతో కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనమవుతుంటే చూడలేకపోతున్నాం” అని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం కేవలం 33 శాతం నష్టం ఉంటేనే పరిహారం ఇస్తామని చెప్పడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట మొత్తం దెబ్బతిన్న చోట తక్షణమే ఎకరాకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాధితులకు అండగా ఉండాలని, పంట నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కుదేలైన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అకాల వర్షాల వల్ల కుప్పకూలిన అన్నదాతల ఆశలకు ప్రభుత్వం తక్షణ సాయం ద్వారా ఊపిరి పోయాలని సర్వత్రా కోరుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు తమ పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


