Last Updated:
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో హుండీలు లెక్కింపు సమయంలో సురేష్ అనే సేవకుడు 59 గ్రాముల బంగారం చోరీ ప్రయత్నం. సెక్యూరిటీ చెక్ చేసి పోలీసులకు అప్పగించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రతినెలా కోట్లాది రూపాయల ఆదాయం. మరి హుండీలు లెక్కింపు చేయాలంటే కచ్చితంగా సేవకులు కావాల్సిందే.. మరి కంటి నిండా డబ్బు చూసిన తర్వాత తప్పు బుద్ధి పుడుతుందో, లేక ముందస్తుగానే స్కెచ్ ప్రకారం వస్తారో ఏమోగానీ ఈ మధ్యకాలంలో ఒకవైపు దేవస్థానం ఉద్యోగులు దేవుడు సొమ్ముపై ఆశపడుతుంటే, మరోపక్క సేవకులు సైతం దేవుడు సొమ్ము కొట్టేసేందుకు క్షేత్రాలకు చేరుకుంటున్నారు.
అది అసలు సిసలైన భక్తుడి మాదిరిగా స్వామివారిని దర్శించుకుని మెడలో కండువా వేసుకుని భక్తిశ్రద్ధలతో హుండీలు లెక్కిస్తూ అదే సమయంలో పొరపాటున బంగారం కనిపించిందా ఇక అంతే సంగతులు అన్న మాదిరిగా చోరీలు జరుగుతున్నాయి. మొన్న వాడపల్లి, నేడు ద్వారకా తిరుమల, ఏదేమైనా వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో దొంగల సంఖ్య పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఒక సేవకుడు భారీగా బంగారం చోరీ చేశాడు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగింది? ఆ సేవకుడెవరు ఒకసారి వివరాలు చూద్దాం..
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్రంలో హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి వై భద్రాద్రి ఇతర దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అయితే ఒక నెలకే పెద్దఎత్తున స్వామివారికి ఆదాయం సమకూరింది. ఇలాంటి తరుణంలో దేవస్థానం ఉద్యోగులతో పాటు సేవకులు ఈ హుండీలు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో స్వామివారి బంగారం స్వామివారి సొమ్ములకే సేవకులు ఎగనామం పెడుతున్నారని చెప్పుకోవచ్చు.
బుధవారం స్వామివారి దివ్య క్షేత్రంలో హుండీలు లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా, తణుకు మండలం సూరంపూడికి చెందిన సురేష్ అనే వ్యక్తి హుండీలో వచ్చిన సొమ్ములు లెక్కిస్తూ ఉండగా, అతడికి 59 గ్రాముల బంగారం మంగళసూత్రం కంటపడింది, మరి అతని బుద్ధి తప్పుగా ఆలోచించిందో, లేక పథకం ప్రకారం స్కెచ్ గా ఇక్కడికి వచ్చాడేమోగానీ ఆ 59 గ్రాముల బంగారు ఆభరణం స్వాధీనం చేసుకుని టాయిలెట్ వస్తుందని బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు, ఇంతలో అనుమానం కలిగిన సెక్యూరిటీ అతన్ని చెక్ చేశారు. ఇంకేముంది బంగారం బయటపడింది.
వెంటనే స్థానిక పోలీసులకు దేవస్థానం ఈవో భద్రాజి సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పోలీసులు దేవస్థానానికి చేరుకుని ఆ వ్యక్తిని విచారించేందుకు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై ఈవో భద్రాజీ మీడియాతో మాట్లాడారు. హుండీలు లెక్కింపు అంతా మోనిటరింగ్ సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని ఎక్కడ తప్పులు జరిగినా తప్పించుకునే ప్రయత్నం జరగదు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో దైవ క్షేత్రాలు హుండీ లెక్కింపులో డబ్బులు పక్కదోవ పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


