మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వమే లక్ష్యం
— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఆదేశాల మేరకు … ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో గురువారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏ.ఆర్ మరియు ఈగల్ జీఆర్పీ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా మరియు ధ్యానంపై సాధన కార్యక్రమం నిర్వహించారు. ఃహార్ట్ ఫుల్ నెస్ః సంస్థ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్ మరియు యోగా టీచర్ డాక్టర్ గోపి ఈ కార్యక్రమానికి విచ్చేసి, పోలీస్ సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానంపై ప్రత్యేక సాధన చేయించారు. నిరంతరం విధుల్లో ఉంటూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీస్ సిబ్బందికి మానసిక ప్రశాంతతను చేకూర్చడం, వారి శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం మరియు వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా నిర్వహించేలా చేయడమే ఈ యోగా మరియు ధ్యాన సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. నిత్య జీవితంలో ధ్యానం మరియు యోగాలను ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో డాక్టర్ గోపీనాథ్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏ.ఓ రవిరాం నాయక్, సూపరింటెండెంట్లు, ప్రసాద్ , నంద, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, బాబ్జాన్, హనుమంతు (ఈగల్ ) జీఆర్పీ ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్ ఎస్ ఐ మద్దిలేటి, హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్లు గాయత్రి, లక్ష్మి మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగా సాధన చేశారు.


