– తలనీలాల హక్కు రూ.1.61 లక్షలకు ఖరారు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాఖ ఇన్స్పెక్టర్ కె. రాణి, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. దేవస్థానంలో కలగలపు బియ్యం బేడలు విక్రయించుకునే హక్కుకు నిర్వహించిన బహిరంగ వేలంలో నలుగురు డిపాజిట్ చెల్లించగా, ముగ్గురు మాత్రమే పోటీలో పాల్గొన్నారు. అయితే గత సంవత్సరంతో పోల్చితే తక్కువ ధర రావడం, సరైన పోటీ లేకపోవడంతో వేలాన్ని అధికారులు వాయిదా వేశారు. ఇక తలనీలాల సేకరణ హక్కుకు సంబంధించి (13-08-2025 నుంచి 04-02-2026 వరకు) షీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించగా, ఐదుగురు డిపాజిట్ చెల్లించగా ముగ్గురు మాత్రమే పోటీలో పాల్గొన్నారు. ఇందులో అత్యధికంగా రూ.1,61,000/-కు పామిడి గ్రామానికి చెందిన యం. ఓబులేష్ హక్కును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఇంద్రావతి సుధాకర్, ముష్టూరు రామకృష్ణ, ధనుంజయ ఆచారి, బొల్లినేని ఓబులేష్, మోపిడి గోవిందు, పోలీస్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


