విశాలాంధ్ర – నార్పల:- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలు–2026లో భాగంగా నార్పల శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరంలో విద్యార్థులకు పలు విద్యా, సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సమ్మర్ ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రంథాలయ వినియోగం, పుస్తకాల ప్రాముఖ్యత, కథలు, చిత్రలేఖనం, గణితం, సైన్స్, యోగా, కంప్యూటర్ ప్రాథమిక నైపుణ్యాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ శిబిరం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పఠనాభిరుచి పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేయడం లక్ష్యంగా ఉందని గ్రంథాలయ వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శాఖా గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ ఏ. కావేరి సమన్వయం చేశారు.


