తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. హోర్మూజ్ జలసంధి, శాంతిఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారన్నారు. అవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. దౌత్య చర్చలపై ముందుకుసాగుతుండగా ఇలాంటి తప్ప్పుడు సమాచారాన్ని ఇరాన్ అంగీకరించదని స్పష్టంచేశారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని, చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని ట్రంప్ను విమర్శించారు. ఇదిలా ఉంటే…అమెరికా- ఇరాన్ మధ్య 20న మరోసారి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఇవి జరగనున్నాయని ఇరాన్ అధికార వర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, దీనిపై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
The post దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్ను మూసేస్తాం: ఇరాన్ appeared first on Visalaandhra.


