విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని చామలూరు గ్రామ సచివాలయాన్ని గౌరవ జాయింట్ కలెక్టర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో కొనసాగుతున్న ప్రజా సేవల అమలు తీరును పరిశీలించారు. ముఖ్యంగా బీఎల్వోలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.ఎస్ఐఆర్ మ్యాపింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి ఇంటి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సమాచారం ఖచ్చితత్వంతో నమోదు కావాలని పేర్కొన్నారు.
అనంతరం సచివాలయంలో అందిస్తున్న సేవలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు వేగవంతంగా సేవలు అందించడంతో పాటు సమస్యలు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర మూర్తి, ఎంపీడీఓ మమతా దేవి, డిప్యూటీ ఎంపీడీఓ (జీఎస్డబ్ల్యూఎస్) సుజాత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
The post చామలూరు సచివాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్… appeared first on Visalaandhra.


