మిత్ర దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత: ఇరాన్
బీజింగ్/ తెహ్రాన్: ప్రపంచ చమురు రవాణా మార్గానికి అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ సేవా రుసుము వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్మూజ్ తమ ప్రాదేశిక జలాల్లో భాగమని, జలసంధిలో సేవా రుసుం వసూలు చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇవి టోల్ కిందకు రావన్నారు. ఈ విషయంపై ఒమన్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కష్టసమయంలో తమకు సహకారం అందించిన మిత్ర దేశాలకు సేవా రుసుం విషయంలో ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హోర్మూజ్లో ప్రయాణ భద్రతకు హామీ ఇవ్వడం, నౌకల రాకపోకలను పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో నౌకల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను ఎదుర్కోవడం వంటివాటిని ఒమన్ సహకారంతో ఇకపై తాము పర్యవేక్షిస్తామని అబ్దుల్ రెజా వెల్లడించారు. మరోవైపు హోర్మూజ్ భద్రతను ఇకపై ఒమన్తో కలసి తాము చూసుకుంటామని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది పేర్కొన్నారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి ఈ జలసంధి రంగస్థలం కాదని అమెరికాను ఉద్దేశించి పరోక్షంగా ఆయన హెచ్చరించారు.
The post హోర్మూజ్లో సేవా రుసుం appeared first on Visalaandhra.


