Weather Alert: రాష్ట్రంలో వింత వాతావరణం.. చలి, ఎండల దోబూచులాటలో పెరుగుతున్న వ్యాధులు.. వైద్యుల కీలక సూచనలివే! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వింత వాతావరణం, పొగమంచు, ఎండ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి, మంగాదేవి సూచనలు కీలకం.

Rapid Read
+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వింతైన వాతావరణం నెలకొంది. చలికాలం ముగిసి వేసవి కాలంలోకి అడుగుపెడుతున్న ఈ సంధి కాలంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. క్యాలెండర్ ప్రకారం ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు చలి కాలాన్ని తలపించేలా దట్టమైన పొగమంచు కురుస్తుంటే, మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ అకస్మాత్తు ఉష్ణోగ్రత మార్పుల వల్ల గ్రామీణ, ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం చిత్రంగా మారింది. తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని రాజోలు, పి.గన్నవరం, అయినవిల్లి వంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉదయం వేళ విపరీతమైన పొగమంచు కురుస్తోంది. నది పక్కనే ఉండటంతో చలి తీవ్రత అధికంగా ఉండి, మంచు తెరల వల్ల వాహనదారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఒక్కసారిగా ఎండ పెరగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఏర్పడి ‘వైరల్ ఫీవర్స్’ ప్రబలుతున్నాయి.

ప్రస్తుతం పిహెచ్‌సీలకు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) వస్తున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలతో ప్రజలు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అయినవిల్లి పిహెచ్‌సీ వైద్యురాలు మంగాదేవి ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఉదయాన్నే పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు తప్పనిసరిగా ముక్కు, చెవులు, నోరు కవర్ అయ్యేలా స్కార్ఫ్ లేదా మాస్క్ ధరించాలి. చల్లటి గాలి చెవుల ద్వారా లోపలికి వెళ్తే తలనొప్పి, చెవిపోటు వచ్చే అవకాశం ఉంది.

చాలామంది దగ్గు రాగానే మెడికల్ షాపులకు వెళ్లి సిరప్‌లు, యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, దగ్గు బయటకు రాకుండా ఆగిపోవడం వల్ల నీరు పట్టే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఈ సీజన్‌లో కలుషిత నీరు, చల్లటి పదార్థాల వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. కాబట్టి నీటిని మరిగించి చల్లార్చి తాగడం, ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఐదు రోజుల పాటు జాగ్రత్తలు పాటిస్తే సహజంగానే వైరల్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని ఆమె తెలిపారు.

కాలం మారుతున్న కొద్దీ దోమల బెడద పెరుగుతోంది. నిలవ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతున్నాయి. మన ఇళ్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవడం అంతే ముఖ్యం. కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పూల కుండీలలో నీటిని నిలవనివ్వకూడదు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ఆశా వర్కర్లను లేదా ఏఎన్ఎంలను సంప్రదించాలి. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *