తెహ్రాన్: ఇరాన్పై అమెరికా వేసిన ఎత్తుగడలను ఇరాన్ సాగనివ్వడం లేదు. ఇరు దేశాల వైఖరిలో మార్పులేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే నూతన ఆయుధంతో దాడికి దిగుతామని తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని తొలగిస్తేనే…హోర్మూజ్ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి తాజా హెచ్చరికలు వచ్చాయి. ‘అతిత్వరలో శత్రు బలగాలపై నూతన ఆయుధాన్ని ప్రయోగిస్తాం. అది వారిని తీవ్రంగా భయపెట్టనుంది. అది వారి పక్కనే ఉంది. దానితో వారికి గుండెపోటు రావొచ్చు’ అని షారమ్ ఇరానీ పేర్కొన్నారు. అయితే, ఆ ఆయుధం ఏంటి అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. హోర్మూజ్ను దిగ్బంధించి…ఇరాన్ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి, చర్చలకు తీసుకురావాలనే అమెరికా వ్యూహాన్ని ఆయన కొట్టిపారేశారు. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎసఎస్ అబ్రహాం లింకన్పై తమ దళాలు దాదాపు ఏడు క్షిపణులతో విరుచుకుపడ్డాయన్నారు. దీంతో అది కొన్ని రోజులు కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని పేర్కొన్నారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ…నౌకలు కొన్ని తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయన్నారు. మరికొన్ని వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈసందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.


