సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి
విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లెనిన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుట్టా హరినాధరెడ్డి మాట్లాడుతూ… మంచి సమాజం లెనిన్ పోరాటం చేసి సఫలీకృతుడయ్యారన్నారు. కారల్ మార్క్ సిద్దాంతంతో పోరాటం చేసి సోవియట్ రష్యాలో కార్మిక రాజ్యం ఏర్పాటు చేశాడన్నారు. దాదాపు 70ఏళ్లు పాటు సోవియట్ రష్యాలో కమ్యూనిస్టులు పాలన చేశారన్నారు. ప్రపంచంలోనే 1/3వంతు భూభాగాన్ని కమ్యూనిస్టులు పాలన చేయడానికి లెనిన్ బాటలు వేశారన్నారు. కాలగమనంలో సోవియట్ యూనియన్ లో పాలకులు అనుసరించిన తప్పుడు విధానాలతో కమ్యూనిస్టులు పాలన కోల్పోయారని హరినాథరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో క్యమ్యూనిస్టుల పాలన ఉండదని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఎగతాళి చేశారన్నారు. అయితే ఆ తరువాత దోపిడీ సమాజం నుంచి మానవాళి విముక్తి కోసం ఏ సిద్దాంతం పని చేయలేదన్నారు. సోవియట్ యూనియన్ ఉన్నపుడు అభివృద్ది చెందుతున్న దేశాలకు అన్ని రకాలుగా చేయూత నిచ్చిందన్నారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత అగ్ర రాజ్యమైన అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తోందన్నారు. ఐక్య రాజ్య సమితి నిబంధనలను సైతం అమెరికా తుంగలో తొక్కుతోందన్నారు. ఇరాన్ పై యుద్ధం ప్రకటించి ప్రపంచ ప్రజలందరూ ఇబ్బందులు పడటానికి అమెరికా కారణమవుతోందన్నారు. ఈ యుద్ధం కారణంగా పెట్రో ఉత్పత్తుల సంక్షోభం ఏర్పడుతోందన్నారు. మన దేశంలో కూడా ఎన్నికల తరువాత పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే విధంగా సంకేతాలు వస్తున్నాయని హరినాథరెడ్డి చెప్పారు. బలమైన కమ్యూనిస్టు రాజ్యం ప్రపంచంలో లేనందునే ఈ దుస్ధితి ఏర్పడిందన్నారు. అందుకే లెనిన్ ఆశయాలను నెరవేరుస్తూ… దోపిడి. పీడన లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి,, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్, సహాయ కార్యదర్శి బండి చలపతి, ప్రజా సంఘాల నాయకులు నదియా, పద్మనాభ రెడ్డి, ఎన్ డి రవి, గోవిందస్వామి, ఉదయ్, నాగరాజు, బలరాం, మహేంద్ర, మంజుల, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.
The post మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం appeared first on Visalaandhra.


