న్యూదిల్లీ: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్కు సంబంధించి కెనడా క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడటంతో ఐసీసీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా ప్రమేయంపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ జరుపుతోంది. కాగా ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ఓ కథనం ప్రచురించింది. న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో దిల్ప్రీత్ బజ్వా అసాధారణంగా, ఖరీదైన ఓవర్ వేయడంతో అతనిపై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఏసీయూ అధికారులు బజ్వాను ప్రశ్నించి, అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్కు కొన్ని వారాల ముందు బజ్వాను కెప్టెన్గా నియమించడం వెనుక పెద్ద కుట్రే జరిగిందని సీబీసీ కథనం పేర్కొంది. 2025 జులైలో కొందరు ఆటగాళ్లను బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు బెదిరించి, బజ్వాకు మద్దతివ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. “బజ్వా ప్రమోషన్కు మద్దతివ్వకపోతే, నీకు, నీ కుటుంబానికి తీవ్ర పరిణామాలు తప్పవు” అని ఓ సీనియర్ ఆటగాడిని బెదిరించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ‘నోవా’ అనే మరో ఆటగాడికి భయానక ఫొటోతో కూడిన మెసేజ్ పంపి హెచ్చరించినట్లు సమాచారం. డబ్బు సంపాదించడానికే మ్యాచ్లను ఫిక్స్ చేసేందుకు బజ్వాను కెప్టెన్గా నియమించారని ‘నోవా’ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కెనడా క్రికెట్ ప్రస్తుత అధ్యక్షుడు అర్విందర్ ఖోసా పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బజ్వాను కెప్టెన్గా ప్రతిపాదించిన వారిలో ఖోసా కూడా ఉన్నారని, అయితే ఆయన ఈ ఆరోపణలను ఖండిస్తూ తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. కెనడా ప్రభుత్వం ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.


