న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, జట్టులో కీలక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టిసారించాలని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ 600కు పైగా పరుగులు చేయడంతోపాటు జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. 2024లో అతని సారథ్యంలోనే కేకేఆర్ చాంపియన్గా నిలిచింది. అయినప్పటికీ 2026 టీ20 ప్రపంచకప్లో శ్రేయస్కు చోటు దక్కలేదు. ప్రస్తుత భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగిస్తుండంతో శ్రేయస్ను సారథిగా నియమించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో జహీర్ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది. “ముందుగా భారత టీ20 జట్టులో భాగం కావాలనే విషయం శ్రేయస్ మదిలో ఉంటుంది. కెప్టెన్సీ విషయానికొస్తే అతను ప్రస్తుతం దాని గురించి ఆలోచిస్తున్నాడో, లేదో నాకు తెలియదు. అతను కొంతకాలంగా ఫ్రాంచైజీలకు కెప్టెన్సీ చేస్తూ విజయవంతం అవుతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఆ పదవికి పోటీదారు అనడం అతిశయోక్తి కాదు. అతనికి స్పష్టంగా ఆ దృక్పథం ఉంది. భారత టీ20 జట్టు కూర్పును దృష్టిలో ఉంచుకుని శ్రేయస్ బ్యాటర్గా రాణించి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం గురించే ఆలోచిస్తుంటాడని నేను భావిస్తున్నాను. ఒక్కసారి జట్టులోకి వచ్చాక మిగతా విషయాలను జట్టు యాజమాన్యం ఎలా చూస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది” అని జహీర్ ఖాన్ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ ఇప్పటివరకు 208 పరుగులు చేశాడు.
The post కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్కు జహీర్ఖాన్ సూచన appeared first on Visalaandhra.


