ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళితుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించలేదని రాబోయే ఎన్నికలలో జడ్పీ చైర్మన్ పదవిని ఎస్సీ మాదిగలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవులను కూడా మాదిగలకు కేటాయించాలని కోరారు. పక్క జిల్లాల్లో దళితులకు చైర్మన్ పదవులు ఇచ్చి సమర్థవంతమైన పరిపాలన సాగిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రస్తుత ప్రభుత్వం వెంటనే భూమిలేని పేదలను గుర్తించి 8వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు.ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లాలో కొన్ని చోట్ల ఊరేగింపులను అడ్డుకున్న ఘటనలను ఖండిస్తూ, బాధ్యులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజు, రాయలసీమ అధికార ప్రతినిధి డా. హెచ్. అక్కులప్ప, రాయలసీమ అధ్యక్షులు కౌకుంట్ల రవి, జిల్లా నాయకులు వెలిగొండ ఓబన్న, డివిజన్ అధ్యక్షులు ఎం. రామాంజనేయులు, సీనియర్ నాయకులు గంగాధర్, తాలూకా అధ్యక్షులు జే. చెన్నప్ప, తాలూకా ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల సురేష్, ప్యాపిలి వన్నూరు స్వామి, నాగరాజు, పెన్నయ్య, ఉండబండ రాజు తదితరులు పాల్గొన్నారు.


