జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రవి హెచ్చరిక
విశాలాంధ్ర – రాప్తాడు: పరిశ్రమల్లో వ్యవసాయానికి వాడే యూరియాను ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (ఎం. రవి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామ పారిశ్రామిక వాడ (ఎం.ఎస్.ఎం.ఈ)లో ఉన్న ‘ఎం.ఎస్ పెయింట్స్’ తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని తయారీ విభాగంతో పాటు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డి.ఏ.ఓ మాట్లాడుతూ.. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ కోసం కేవలం ‘ఇండస్ట్రియల్ టెక్నికల్ గ్రేడ్ యూరియా’ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రాయితీతో రైతులకు అందాల్సిన వ్యవసాయ యూరియాను పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తే సహించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఏడీఏ వెంకట కుమార్, టెక్నికల్ ఏఓ రాకేష్, మండల వ్యవసాయ అధికారి కృష్ణ చైతన్య, ఏఈఓ రంజిత తదితరులు పాల్గొన్నారు.


