అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది.ఈ చర్యతో ఇరాన్కు రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.4,081 కోట్లు నష్టం వాటిల్లవచ్చని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అంచనా వేసింది.
కాల్పుల విరమణపై చర్చలు ఫలించకపోవడంతో, ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఈ కఠిన చర్య తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.సోమవారం నుంచే ఈ దిగ్బంధనం అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులైన చమురు, పెట్రోరసాయన ఉత్పత్తులు, ఎరువులు, ఆహార పదార్థాల ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బతీయడమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.అమెరికా ఆర్థిక విభాగానికి చెందిన మాజీ అధికారి మియాద్ మలేకి అంచనాల ప్రకారం, ముడి చమురు, పెట్రోరసాయన ఉత్పత్తుల ఎగుమతుల ద్వారానే రోజుకు 276 మిలియన్ డాలర్ల నష్టం సంభవించవచ్చు.
అయితే ఈ నష్టం అంచనాలు కొన్ని కీలక అంశాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికా దిగ్బంధనం ఎంత కట్టుదిట్టంగా అమలవుతుంది, హర్మూజ్ జలసంధికి వెలుపల ఉన్న జాస్క్ నౌకాశ్రయం ద్వారా ఇరాన్ ఎంత మేర చమురును మళ్లించగలదు వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.ఇదిలా ఉండగా, ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న 154 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు నిల్వలు తక్షణ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని ఖజూశ్రీవతీ సంస్థ వెల్లడించింది.
ఈ దిగ్బంధనాన్ని కచ్చితంగా అమలు చేయడం అమెరికాకు పెద్ద సవాలుగా మారే అవకాశముంది.
హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నౌకా మార్గాల్లో ఒకటి.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.
ఇంత పెద్ద స్థాయిలో నౌకా రాకపోకలను నియంత్రించడం సులభం కాదు.మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన 16 యుద్ధ నౌకలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.ఈ నేపథ్యంలో దిగ్బంధనాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం కష్టతరమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఇరాన్ నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకునే చైనాపై ఒత్తిడి తీసుకురావడం కూడా అమెరికా వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.చైనాను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంతో ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.మొత్తంగా దిగ్బంధన ప్రకటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ, దాని అమలు, ఫలితాలు అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశముందని స్పష్టమవుతోంది.


