సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం: డి.రాజా పిలుపు
న్యూదిల్లీ: కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఐక్యంగా పోరాటాలు అవసరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉక్కు సంకల్పంతో కదం తొక్కాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈనెల 12న అనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామంటూ డి.రాజా బుధవారం సామాజిక మాధ్యమం వేదికగా పిలుపునిచ్చారు. ఉద్దేశపూర్వకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సర్కారు రద్దు చేయడాన్ని ఆక్షేపించారు. ఉద్యోగాలు, వేతనాలు, సామాజిక భద్రత, గౌరవమైన పనికి హాని కలించే ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ కార్మికులు, కర్షకులను అభద్రతా అనే అగాధంలోకి నెట్టివేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని, దీనిని ప్రతిఘటించాలని డి.రాజా సూచించారు. సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని, దానిని విజయవంతం చేయాలంటూ కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, గిగ్ వర్కర్లు, స్కీమ్ వర్కర్లు, ఉద్యోగులతో పాటు అన్ని ప్రజాస్వామిక శక్తులకు సీపీఐ తరపున పిలుపునిచ్చారు. ఐక్యతాను, ప్రతిఘటనను, గౌరవమైన పని హక్కును తిరిగి సాధించే సంకల్పాన్ని చాటే విధంగా ఈ సమ్మె జరగాలని డి.రాజా వెల్లడించారు. సమ్మె జయప్రదానికి పిలుపునిచ్చారు.
The post సర్కారు మెడలువంచుదాం appeared first on Visalaandhra.


