విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి జి రామ్ జి చట్టం తెచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా గ్రామాలలోని వ్యవసాయ కూలీలు ఎంతో నష్టపోతారన్నారు. చట్టం మార్పులు నిరసిస్తూ ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండ్లపల్లి వరకు పాదయాత్ర 12వ తేదీ బండ్లపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలో కేంద్ర, రాష్ట్ర సిపిఐ నాయకులు పాల్గొంటారు. కావున వ్యవసాయ కూలీలు, కార్మికులు రైతులు, దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య సంఘం నాయకుడు సాలవేముల సూరి, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి శ్రీరాములు, రమణ ఈరన్నారాయణ పాల్గొన్నారు.


