విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు తెల్లవారుజామున నుంచే క్యూలైన్లలో నిలబడి గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో హోటల్ యాజమాన్యాలకు మాత్రం సులభంగా, వేగంగా సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పారదర్శకత లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్యాస్ బుకింగ్ సక్రమంగా జరగకపోవడం, ఫోన్ ద్వారా సంప్రదించినా స్పందన లేకపోవడం, కార్యాలయానికి వెళ్లినా సిబ్బంది అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నామని పలువురు పేర్కొంటున్నారు.ఈ సమస్యలపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపడితే సిలిండర్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భరత్ గ్యాస్ యాజమాని ఎక్కడ? కార్యాలయ నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ ఎందుకు లేదు? అంటూ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, గ్యాస్ సరఫరాను సక్రమంగా నిర్వహించడంతో పాటు వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


