. టెక్నికల్ కమిటీని నియమించండి
. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు డీపీఆర్లు
. అధికారులకు మంత్రుల ఆదేశం
విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన సింగూరు డ్యామ్ సేఫ్టీ పై రాజనర్సింహ ఉత్తమ్, వివేక్ చర్చించారు. డ్యామ్ సేఫ్టీ ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యత అంశం అన్నారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూర్ డ్యామ్ను పరిరక్షించాలని మంత్రులు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులపై టెక్నికల్ కమిటీని నియమించాలని సూచించారు. ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీపీఆర్లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. ఆ పనులకు ఉగాదిలోగా శ్రీకారం చుట్టాలని అన్నారు. సింగూరు కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు సుందరీకరణ , పరిరక్షణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆందోల్ నియోజకవర్గం లో చిన్న నీటి ప్రాజెక్టులైనా చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఈఎన్సీలు రమేష్ బాబు, శ్రీనివాస్, టి.శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ ఎసఈ బి.రాజమ్మ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఇంచార్జి ఎస్సీ రఘునాథ్ రావు, ఈఈ బీమ్, డీఈ నాగరాజ్, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
The post ‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి appeared first on Visalaandhra.


