ఇప్పటి వరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ ఇదే
జాతీయ స్థాయిలో అప్రతిహత ప్రగతి
భవిష్యత్ అవసరాలకు ప్రణాళికలతో సిద్ధం: భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్ : మరోసారి తన అప్రతిహత ప్రగతిని రాష్ట్రం చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి, ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు ఉన్నతాధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ మైలురాయి తెలంగాణ ఆర్థికవృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరిష్ట స్థాయికి సమానంగా లేదా అధిగమించే స్థితికి చేరుకున్నాం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోంది అన్నారు. 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్తో తెలంగాణ రాష్ట్రం, సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను నమోదు చేసిన మధ్యప్రదేశ్, 19,600 నుంచి 20,600 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు సమానంగా నిలిచింది అన్నారు. పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, చáత్తీస్గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్ను తెలంగాణ నమోదు చేసిందని తెలిపారు. భౌగోళికంగా చిన్నదైనా, అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. ఐటీ, ఔషధ తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణం అని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. 2023-24లో గరిష్ట డిమాండ15,623 మెగావాట్లు , 2024-25 లో 17,162 మెగావాట్లు, 2025-26లో ఈ నెల మూడో తేదీ నాటికి 18,139 మెగావాటు కొత్త గరిష్ట దశలోకి ప్రవేశించామని వివరించారు. “తెలంగాణ కేవలం సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట డిమాండ్లకు ముందస్తు ప్రణాళికలతో పూర్తిగా సిద్ధంగా ఉంది. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలం” అని భట్టి చెప్పారు.
కంట్రోల్ రూమ్ల నుంచి నుంచి ఫీల్డ్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించాం. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అని డిప్యూటీ సీఎం తెలిపారు.


