విశాలాంధ్ర-రాప్తాడు : హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి.బి.ఆర్. శర్మ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెడుతూ రూపొందించిన పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు వినూత్నమైన టెక్నికల్ మోడల్స్ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ వేడుకలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సైన్స్ డే యొక్క ప్రాముఖ్యతను, ప్రస్తుత కాలంలో శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు. నేటి యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా, కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తూ పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చాటి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కళాశాల ఎం.డి. శ్రీ వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ డా. టి. విష్ణు వర్ధన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ బి.వి. కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్ వెన్నపూస రవీంద్ర రెడ్డి విద్యార్థులకు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమానిటీస్ అండ్ సైన్స్ విభాగాధిపతి డా. ఎ. చంద్రబాబు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
The post ఘనంగా సైన్స్ డే వేడుకలు appeared first on Visalaandhra.


