. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత
. ఒక విచారణ మరో దానిపై ప్రభావం చూపదని స్పష్టీకరణ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక విచారణ మరో కమిటీ విచారణపై ప్రభావం చూపబోదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినా దానికి అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ కమిషన్/కమిటీని ఏర్పాటుచేయాలని ఈ నెల 3వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిందని ఆరోపిస్తూ, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుచేసి తర్వాత, దానికి అతీతంగా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేయడం ఎంతవరకు సబబు అని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాతో పాటు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ నివేదికను పరిశీలించి పరిపాలనా లోపాలు, టెండర్ అవకతవకలు, బాధ్యులను గుర్తించడానికే ఈ కమిటీని నియమించినట్లు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అలాగే సీబీఐ సిట్ విచారణకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. దీనిపై సీజేఐ ధర్మాసనం స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్ కిందకు రాదని, పరిపాలనాపరమైన లోపాల గుర్తింపు కోసం మాత్రమే ఏర్పాటు చేసిందని పేర్కొంది.


