Yogi Vemana Brahmotsavam: సత్యసాయి జిల్లాలో వేమన బ్రహ్మోత్సవాల సందడి.. తిరునాళ్ల పూర్తి వివరాలు ఇవే.. | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

శ్రీ సత్యసాయి జిల్లాలో కటారుపల్లి యోగి వేమన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగి, మహాశక్తి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా, ఏప్రిల్ 1న గొడుగుల మెరువనతో ముగింపు

+

వేమన

వేమన బ్రహ్మోత్సవాలలో హైలెట్స్ ……

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన గాండ్లపెంట మండలం, కటారుపల్లిలో వెలసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా, భక్తిప్రపత్తుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాకవి, సామాజిక సంస్కర్త, యోగి అయిన వేమన ఆరాధనలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ తిరునాళ్లు ఈసారి గ్రామాన్నంతటినీ ఒక పండుగ వాతావరణంలో ముంచెత్తాయి. ఆలయ పీఠాధిపతి పూజారి నంద వేమారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఉత్సవాలు కేవలం ఒక మతపరమైన కార్యక్రమంలా కాకుండా, తెలుగు సంస్కృతి, సంప్రదాయం, కళల సమ్మేళనంగా నిలిచాయి.

బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన ఘట్టం ‘మహాశక్తి పూజ’ (కుంభాభిషేకం). ప్రతి ఏటా మొదటి రోజున ఈ పూజను నిర్వహించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఏడాది కూడా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను ప్రారంభించారు.

ఆలయం ఎదుట పచ్చని వేపాకులను పరిచి, వాటిపై భక్తులు సమర్పించిన ఉడికించిన జొన్నలను పెద్ద రాసిగా పోస్తారు. వెదురు గంపలతో తెచ్చిన ఈ జొన్న రాసిపై పసుపు, కుంకుమలు చల్లి, పూలతో సుందరంగా అలంకరిస్తారు. ఈ కుంభాన్ని దైవ ప్రసాదంగా భావించే భక్తులు, దానిని పొందేందుకు పెద్ద ఎత్తున పోటీ పడటం ఇక్కడి ప్రత్యేకత. అనంతరం గ్రామదేవతకు బలి ఇచ్చి, ఊరి పొలిమేరల వరకు ఊరేగింపు నిర్వహించి గ్రామానికి ఎటువంటి కీడు కలగకూడదని మొక్కులు చెల్లించుకున్నారు.

వేమన బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కళాకారులు ధరించిన దుర్గమ్మ, మహాకాళి వేషధారణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. భీకరమైన రౌద్ర రూపంలో, అమ్మవారి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ కళాకారులు చేసిన నృత్యాలు చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. ఈ ప్రదర్శనలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించాయి.

ఆలయ ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో, రకరకాల పూలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. యోగి వేమన శిలా విగ్రహాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించడంతో ఆలయం ఆధ్యాత్మిక కాంతితో విరాజిల్లుతోంది. రాత్రి సమయాల్లో విద్యుత్ కాంతుల మధ్య ఆలయ గోపురం ధగధగలాడుతూ భక్తులకు కనువిందు చేస్తోంది.

ఏప్రిల్ ఒకటవ తేదీ సాయంత్రం జరగబోయే ‘గొడుగుల మెరువన’ (గొడుగుల ఊరేగింపు)తో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇది ఈ ఉత్సవాల్లోనే అత్యంత వైభవమైన ఘట్టం. వేలాది మంది భక్తుల సమక్షంలో, మంగళవాయిద్యాల మధ్య ఈ ఊరేగింపు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణపై పీఠాధిపతి నంద వేమారెడ్డి మాట్లాడుతూ.. అక్కడక్కడ చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల లేదా సమయాభావం వల్ల డ్యాన్స్ షోలు, కొన్ని ఈవెంట్లు వాయిదా పడినప్పటికీ, ప్రధాన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ అనుకున్న విధంగానే అద్భుతంగా జరిగాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని, స్థానిక ప్రజలే కాకుండా పొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలిరావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. కటారుపల్లి వేమన తిరునాళ్లు భక్తులలో క్రమశిక్షణను, భక్తిని పెంపొందించడమే కాకుండా, వేమన పద్యాల ద్వారా ఆయన అందించిన సామాజిక సందేశాన్ని నేటి తరానికి గుర్తుచేస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *