Last Updated:
ఒక యువతిని తన నివాసానికి పిలిపించుకున్న నేవీ ఉద్యోగి, ఆమెను హతమార్చడమే కాకుండా.. సాక్ష్యాలను మరుగున పరచడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో భద్రపరిచాడు.
Visakhapatnam: విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. ఒక యువతిని తన నివాసానికి పిలిపించుకున్న నేవీ ఉద్యోగి, ఆమెను హతమార్చడమే కాకుండా.. సాక్ష్యాలను మరుగున పరచడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో భద్రపరిచాడు. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈనాడు కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర (35) ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతను గాజువాకలోని ఎల్.బి.నగర్ ‘కీర్తి ఎన్క్లేవ్’ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. రవీంద్రకు వివాహమైంది, అయితే అతని భార్య గత నెల రోజులుగా విజయనగరంలోని తన పుట్టింట్లో ఉంటోంది.
ఈ క్రమంలో, విశాఖలోని సాలగ్రామపురానికి చెందిన మౌనిక (29) అనే యువతితో రవీంద్రకు పరిచయం ఏర్పడింది. ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్కు పిలిపించిన రవీంద్ర, ఏదో విషయంలో ఆమెతో గొడవకు దిగాడు. వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర, ఆమెను పాశవికంగా హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం, మృతదేహాన్ని ఎలా వదిలించుకోవాలో ఆలోచించిన నిందితుడు, కిరాతక నిర్ణయం తీసుకున్నాడు. మౌనిక శరీర భాగాన్ని ముక్కలుగా నరికి, వాటిని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తన ఇంట్లోని ఫ్రిజ్లో దాచాడు. అయితే, మృతదేహంలోని తల భాగం మాత్రం అక్కడ కనిపించలేదని, దానిని ఎక్కడైనా పడేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాత్రి సమయంలోనే నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్కు వెళ్లిన రవీంద్ర, తాను చేసిన పాపాన్ని ఒప్పుకుని లొంగిపోయాడు.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు చెబుతున్న వివరాల ప్రకారం.. మౌనిక తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఈ ఘతుకానికి పాల్పడినట్లు తెలిపాడు. అయితే, ఇది కేవలం నేరం నుండి తప్పించుకోవడానికి చెబుతున్న మాటలా లేక నిజంగానే ఆర్థిక వివాదాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు ఫ్లాట్లో ఆధారాలను సేకరించారు.
అత్యంత రద్దీగా ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఇలాంటి ఘోరం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అపార్ట్మెంట్లోకి యువతి రావడం, ఆ తర్వాత హత్య జరగడం వంటివి ఎవరూ గమనించకపోవడం గమనార్హం. ఒక బాధ్యతాయుతమైన నేవీ ఉద్యోగంలో ఉండి, ఇలాంటి అమానుష చర్యకు పాల్పడటం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది. మౌనిక కుటుంబ సభ్యులు ఈ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



