Last Updated:
ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మరియు వెండి బయటపడ్డాయి.
Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ రవాణాపై నిఘా పెంచిన అధికారులు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఎవరికీ అనుమానం రాకుండా సెల్ఫోన్ల పెట్టెల మధ్యలో దాచి తరలిస్తున్న ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టును వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మరియు వెండి బయటపడ్డాయి.
విజయవాడ వాణిజ్య పన్నుల మూడో డివిజన్ అధికారులకు అక్రమ బంగారం తరలింపుపై ముందస్తుగా పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన డీసీటీవో కిరణ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం బుధవారం తెల్లవారుజామున నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో నిఘా పెట్టింది. ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనదారుడిని అడ్డుకుని తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సదరు వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో సెల్ఫోన్ల ఖాళీ పెట్టెలు కనిపించాయి. తొలుత సాధారణ ఫోన్ల తరలింపుగా భావించినా, నిశితంగా పరిశీలించగా ఆ పెట్టెల మధ్యలో రెండు ప్రత్యేకమైన బాక్సులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి గురించి నిలదీయగా, అందులో కేవలం మందులు ఉన్నాయని చెప్పి నిందితుడు అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే అధికారుల అనుమానం బలపడటంతో ఆ పెట్టెలను తెరిచి చూడగా, అందులో మెరిసిపోయే బంగారం, వెండి ఆభరణాలు దర్శనమిచ్చాయి.
అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తులో..
బంగారం: 275 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు.
వెండి: 308 గ్రాముల వెండి వస్తువులు ఉన్నాయి.
విలువ: వీటి మొత్తం విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వెంటనే ఈ వస్తువులను సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఆభరణాల యజమానులను పిలిపించి, వారి సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ బాక్సులను అధికారికంగా తెరిచి పంచనామా నిర్వహించారు.
ప్రాథమిక విచారణలో ఈ బంగారాన్ని హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. నగరంలోని నాలుగు ప్రధాన బంగారు దుకాణాలకు ఈ సరుకును సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. తరలిస్తున్న వస్తువులకు ఎటువంటి బిల్లులు లేకపోవడంతో, దీనిని అక్రమ రవాణాగా నిర్ధారించారు. ఈ కేసులో భాగంగా ప్రభుత్వం మూడు శాతం పన్నుతో పాటు మరో మూడు శాతం జరిమానాను వసూలు చేయనుంది. తద్వారా వాణిజ్య పన్నుల శాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది. అక్రమంగా బంగారం తరలించి పన్ను ఎగవేతకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నగరంలో మరిన్ని దుకాణాలపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



