Vijayawada: తక్కువ ధర అని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడే ఛాన్స్ ఉంది! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు, దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లక్ష రూపాయలు పలికే ఫోన్‌ను కేవలం రూ. 40,000 లేదా రూ. 50,000లకే ఇస్తామంటూ నమ్మిస్తారు. తీరా కొన్నాక, కొన్ని రోజులకే పోలీసులు మీ తలుపు తట్టినప్పుడు కానీ తెలియదు.. మీరు కొన్నది దొంగిలించిన ఫోన్ అని!

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Vijayawada: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఐఫోన్ లేదా ఇతర ఖరీదైన ఫోన్లు చేతిలో ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు, దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లక్ష రూపాయలు పలికే ఫోన్‌ను కేవలం రూ. 40,000 లేదా రూ. 50,000లకే ఇస్తామంటూ నమ్మిస్తారు. తీరా కొన్నాక, కొన్ని రోజులకే పోలీసులు మీ తలుపు తట్టినప్పుడు కానీ తెలియదు.. మీరు కొన్నది దొంగిలించిన ఫోన్ అని! ఈనాడు కథనం ప్రకారం.. ఇటీవల తెనాలిలోని ఒక ప్రముఖ షోరూం నుంచి కొన్ని మొబైల్ ఫోన్స్ చోరీకి గురయ్యాయి. నిందితులు ఆ ఫోన్లను అమాయకులకు తక్కువ ధరకే విక్రయించారు. కొందరికైతే నెలవారీ కిస్తీల (EMI) సౌకర్యం కూడా కల్పించారు. తక్కువ ధరకే ఫోన్ వచ్చిందని సంతోషపడ్డ బాధితుల సంబరం కొన్ని గంటలు కూడా నిలవలేదు. పోలీసులు ఐఎంఈఐ (IMEI) నంబర్ ఆధారంగా వారిని వెతుక్కుంటూ వచ్చి, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.

పోలీసులు మిమ్మల్ని ఎలా గుర్తిస్తారు?

ప్రతి మొబైల్ ఫోన్‌కు 15 అంకెల IMEI (International Mobile Equipment Identity) నంబర్ ఉంటుంది.

సిమ్ కార్డ్ అలర్ట్: దొంగిలించిన ఫోన్లో మీరు కొత్త సిమ్ కార్డ్ వేయగానే, ఆ సమాచారం వెంటనే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా పోలీసులకు చేరుతుంది.

CEIR పోర్టల్: భారత ప్రభుత్వం ‘సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్’ (CEIR)ను ప్రవేశపెట్టింది. ఫోన్ పోగొట్టుకున్న వారు ఇందులో ఫిర్యాదు చేయగానే ఆ ఫోన్ బ్లాక్ అవుతుంది. ఆ ఫోన్‌ను మరెవరూ వాడలేరు.

ట్రాకింగ్: మీరు ఫోన్ ఆన్ చేయగానే మీ లొకేషన్ పోలీసులకు తెలిసిపోతుంది.

చట్టపరమైన చిక్కులు

“నాకు తెలియదు, నేను డబ్బులు ఇచ్చి కొన్నాను” అని చెప్పినా పోలీసులు వదిలిపెట్టరు. సరైన ధ్రువపత్రం (Bill) లేకుండా ఫోన్ కొనడం నేరం. మిమ్మల్ని కూడా ఆయా చోరీ కేసుల్లో నిందితులుగా చేర్చే ప్రమాదం ఉంది. దొంగిలించిన వస్తువులను కొనడం కూడా నేరమేనని డీఎస్పీ బి. జనార్ధనరావు హెచ్చరిస్తున్నారు.

కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అసలు బిల్లు: ఫోన్ కొనేటప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లు అడగాలి. దానిపై ఉన్న IMEI నంబర్, ఫోన్లో ఉన్న నంబర్ ఒకటో కాదో సరిచూసుకోవాలి.

KYM App: ప్రభుత్వం అందించే ‘Know Your Mobile’ (KYM) యాప్ ద్వారా ఐఎంఈఐ నంబర్‌ను వెరిఫై చేయవచ్చు. అది బ్లాక్ లిస్ట్‌లో ఉంటే వెంటనే తెలిసిపోతుంది.

నకిలీ ఆశలు: నమ్మకం లేని వ్యక్తుల దగ్గర, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో (OLX వంటివి) అపరిచితుల నుంచి బిల్లు లేకుండా ఫోన్లు కొనవద్దు.

గుర్తుంచుకోండి, కొన్ని వేల రూపాయలు ఆదా చేద్దామనుకుంటే.. మీ పరువు పోవడంతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పక్కా ధ్రువపత్రాలతోనే మొబైల్ కొనుగోలు చేయండి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *