Last Updated:
Sri Talupulamma లోవ క్షేత్రం భక్తి ప్రకృతి సోయగాలతో ఆకట్టుకుంటూ ఆధునిక డిజిటల్ సిస్టమ్ PhonePe పేమెంట్లతో దర్శన సేవలు అందిస్తూ మరింత ప్రసిద్ధి చెందుతోంది.
ఉత్తరాంధ్రలో భక్తి, ప్రకృతి సోయగాలు కలిసిన పవిత్ర స్థలంగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ (Sri Talupulamma) అమ్మవారి ఆలయం లోవ క్షేత్రం ఇటీవలి కాలంలో మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఆదివారం, మంగళవారం, గురువారం వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు కొండకొండల మధ్య వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఆదివారాలు అయితే రికార్డు స్థాయిలో రద్దీ కనిపిస్తుంది. జిల్లాలో ఆదాయపరంగా కూడా రెండో స్థానంలో నిలిచే ఈ దేవస్థానం ఇటీవల పునర్నిర్మాణంతో కొత్త కాంతి సంతరించుకుంది.
కాకినాడ జిల్లాలోని లోవకొత్తూరు ప్రాంతంలో అటవీ సోయగాల మధ్య స్వయంభువుగా వెలసిన తలుపులమ్మ అమ్మవారు భక్తులకు కొంగు బంగారు దేవతగా పూజలందుకుంటున్నారు. కొండల మధ్య విరాజిల్లే ఈ క్షేత్రం సహజ సౌందర్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులు వంటావార్పులు చేసుకుని, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఇలాంటి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకు దేవస్థానం ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెనుమత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో ప్రత్యేక డిజిటల్ మిషన్లను ప్రారంభించారు. ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా భక్తులు క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా, తమకు కావాల్సిన దర్శనం, ప్రసాదం లేదా ఇతర సేవలను స్క్రీన్పై ఎంపిక చేసుకుని, ఫోన్పే వంటి ఆన్లైన్ పేమెంట్ల ద్వారా టికెట్ పొందవచ్చు. అనంతరం నేరుగా సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.
దేవస్థాన అభివృద్ధి పనులను కూడా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాబోయే గంధమావస్య జాతర, ఆషాఢమాసం ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు. పౌర్ణమి రోజున చండీ హోమం, అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్ ద్వారా పరోక్షంగా పాల్గొనే అవకాశాన్ని కూడా దేవస్థానం కల్పిస్తోంది. భక్తి, ప్రకృతి, సాంకేతికత కలయికతో లోవ క్షేత్రం ఇప్పుడు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh
Mar 26, 2026 10:11 PM IST


