Last Updated:
విశాఖపట్నం LV Nagarలో చింతాడ రవీంద్ర Indian Navy టెక్నీషియన్ తన పరిచయస్తురాలు మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచిన ఘటన నగరాన్ని కుదిపేసింది.
విశాఖపట్నం నగరంలో అత్యంత కిరాతకమైన, ఒళ్ళు గగుర్పొడిచే హత్యోదంతం వెలుగు చూసింది. కేవలం సినిమాల్లో మాత్రమే చూసే విధంగా, ఒక మహిళను అత్యంత క్రూరంగా అంతం చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన వైనం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. నేవీలో పని చేస్తున్న ఒక వ్యక్తి, ఇంతటి రాక్షసత్వానికి ఒడిగట్టడం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘోర ఘటనపై సమగ్ర కథనం ఇక్కడ ఉంది.
మహా విశాఖలోని ఎల్వీ నగర్ (LV Nagar) ఆదివారం రాత్రి ఒక భయంకరమైన నేరానికి సాక్ష్యంగా నిలిచింది. నమ్మించి పిలిచి, నట్టేట ముంచి, ప్రాణాలు తీయడమే కాకుండా.. సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితుడు అనుసరించిన తీరు చూస్తుంటే వృత్తిపరంగా అతను ఎంతటి క్రూరమైన ఆలోచనాపరుడో అర్థమవుతోంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు చింతాడ రవీంద్ర (35) విజయనగరం జిల్లా రాజం గ్రామానికి చెందినవాడు. అతను భారత నౌకాదళం (Indian Navy)లో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు. విశాఖలోని ఎల్వీ నగర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో రవీంద్ర నివసిస్తున్నాడు. రవీంద్ర భార్య సుమారు నెల రోజుల క్రితమే విజయనగరంలోని తన పుట్టింటికి వెళ్లడంతో, అతను ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకున్న రవీంద్ర, తన పాత పరిచయస్తురాలైన మౌనిక (29)ను ఆదివారం రాత్రి తన ఫ్లాట్కు ఆహ్వానించాడు.
ఆదివారం రాత్రి ఫ్లాట్లో రవీంద్రకు, మౌనికకు మధ్య ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర, మౌనికను దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ శరీర భాగాలను రెండు వేర్వేరు మూటల్లో కట్టి, వాటిని తన ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో దాచిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతోనే అతను ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నేరం చేసిన తర్వాత ఏం చేయాలో పాలుపోని రవీంద్ర, నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను ఒక మహిళను చంపి ఫ్రిజ్లో దాచానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే అతనిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు, అక్కడ ఫ్రిజ్లో రక్తపు మడుగులో ఉన్న రెండు మూటలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా మౌనిక శరీర భాగాలు లభ్యమయ్యాయి. అయితే, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మౌనిక తల మాత్రం అక్కడ కనిపించలేదు. నిందితుడు తలను ఎక్కడో దూరంగా విసిరేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల విచారణలో రవీంద్ర చెప్పిన కారణాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మౌనిక తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ వేధింపులు భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని అతను వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, కేవలం డబ్బు కోసమే ఇంతటి క్రూరమైన హత్య చేశాడా? లేక దీని వెనుక మరేదైనా వివాహేతర సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



