Online Games: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. కన్నవారిని పొట్టనబెట్టుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

రియాద్‌లో గాలి రవి, గాలి శ్రీదేవి దంపతులను యెజ్ర ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనంతో హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు ప్రవాసీయులను షాక్‌కు గురిచేసింది.

News18
News18

నేటి కాలంలో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో వ్యసనంగా మారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఒక యువకుడు, తనను మందలించారనే కోపంతో కన్నతల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపడమే కాకుండా, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన తెలుగు ప్రవాసీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి (49), గాలి శ్రీదేవి (43) దంపతులు కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు. రవి అక్కడ ఒక బ్యాంకులో పనిచేస్తుండగా, శ్రీదేవి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు యెజ్ర ప్రభాకర్. ప్రస్తుతం ఇతడు స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్-2 (12వ తరగతి) చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలకు హాజరవుతున్నాడు.

యెజ్ర ప్రభాకర్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడు. కేవలం ఆటల కోసం తన తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి దాదాపు రూ. 5 లక్షల విలువైన అత్యాధునిక గేమింగ్ ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేయించుకున్నాడు. చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, రోజులో ఎక్కువ సమయం గేమింగ్‌కే కేటాయించేవాడు. కుమారుడి భవిష్యత్తు నాశనమైపోతుందన్న ఆవేదనతో తల్లిదండ్రులు అతడిని తరచుగా మందలించేవారు.

గత గురువారం రాత్రి యెజ్ర ప్రభాకర్ గేమ్‌లో మునిగిపోవడంతో, తల్లిదండ్రులు మరోసారి అతడిని వారించారు. చదువుకోవాలని, గేమ్స్ తగ్గించాలని గట్టిగా చెప్పారు. ఈ క్రమంలో జరిగిన చిన్నపాటి వాగ్వివాదం పెరిగి, ప్రభాకర్ ఆవేశంతో ఊగిపోయాడు. తన విచక్షణను కోల్పోయిన అతడు, ఇంట్లోని కత్తితో తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా జాలి చూపకుండా పదే పదే పొడిచి వారిని హత్య చేశాడు.

తల్లిదండ్రులను అంతమొందించిన తర్వాత ప్రభాకర్ ప్రవర్తన అత్యంత విచిత్రంగా ఉంది. ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకున్నాడు. శవాల మధ్యే కూర్చుని భోజనం పూర్తి చేశాడు. తిన్న తర్వాత, కాసేపటికి తాను చేసిన ఘోరం అర్థమైందో లేక భవిష్యత్తుపై భయం కలిగిందో కానీ, నివసిస్తున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రియాద్‌లోని హరా ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసీయులు ఈ వార్త విని షాక్‌కు గురయ్యారు. రవి, శ్రీదేవి దంపతులు అందరితో కలివిడిగా ఉండేవారని, అలాంటి వారు కన్న కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని వారు వాపోతున్నారు. గేమింగ్ ప్రభావం యువతపై ఎంతటి విషప్రభావాన్ని చూపుతుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనం.

ఆన్‌లైన్ గేమ్‌లు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కావాలి. అవి హింసను ప్రేరేపిస్తుంటే వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి. పిల్లలు డిజిటల్ ప్రపంచంలో దేనికి ఆకర్షితులవుతున్నారో నిరంతరం పర్యవేక్షించడం అవసరం. ఆవేశకావేశాల్లో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను నాశనం చేస్తాయి. ఈ ఘటన కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదు, నేటి డిజిటల్ యుగంలో తల్లిదండ్రులందరికీ ఒక హెచ్చరిక లాంటిది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *