OLX Scam: ఓఎల్ఎక్స్ దొంగ దొరికేశాడు.. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన కేటుగాడు చివరకు అరెస్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

OLX Scam: ఇటీవలి కాలంలో ఓఎల్‌ఎక్స్‌లో కార్లు అమ్ముతానంటూ పలువురిని మోసం చేసిన దొంగ దొరికాడు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఓఎల్ఎక్స్ (OLX) వేదికగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్న భీమడ అజిత్ కుమార్ అనే ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కార్ల అమ్మకాల పేరుతో యజమానులను, కొనుగోలుదారులను మోసం చేస్తూ మూడు రాష్ట్రాల పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అజిత్‌ను చాకచక్యంగా పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ కృష్ణప్రసన్న వెల్లడించారు. ఈనాడు కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడేనికి చెందిన అజిత్ కుమార్, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓఎల్ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను తన మోసాలకు వేదికగా మార్చుకున్నాడు.

అజిత్ మోసం చేసే తీరు

నకిలీ ప్రకటనలు: ఓఎల్ఎక్స్‌లో కార్ల అమ్మకాలకు సంబంధించిన ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేవాడు. తక్కువ ధరకే కారు వస్తుందని నమ్మి కొనుగోలుదారులు అతన్ని సంప్రదించగానే తాను డీలర్నని పరిచయం చేసుకునేవాడు. కారు అమ్మాలనుకునే యజమానులకు ఫోన్ చేసి, మీ కారును తాను విక్రయించి పెడతానని నమ్మించేవాడు. అడ్వాన్స్ ఇస్తానని చెప్పి వారి నమ్మకాన్ని చూరగొనేవాడు.

ఖాతాల మళ్లింపు: కొనుగోలుదారులు డబ్బులు పంపే సమయంలో, అజిత్ తన సొంత బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వకుండా తెలివిగా వ్యవహరించేవాడు. బంగారు షాపుల యజమానుల ఖాతా నంబర్లను వారికి ఇచ్చి, నగదు బదిలీ చేయించేవాడు. ఆ తర్వాత ఆ నగదును బంగారంగా మార్చుకుని అక్కడి నుంచి జారుకునేవాడు. ఒకసారి నగదు చేతికి అందగానే, తన ఫోన్ నంబర్‌ను స్విచ్ఛాఫ్ చేసి బాధితులకు దొరక్కుండా అదృశ్యమయ్యేవాడు.

3 రాష్ట్రాలు.. 32 కేసులు

అజిత్ కుమార్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోనూ తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. నిందితుడిపై మొత్తం 32 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో సుమారు 12 ఓఎల్ఎక్స్ మోసాలకు పాల్పడ్డాడు. ఏపీలో 8 కేసులు నమోదయ్యాయి (విజయవాడలో 4, విశాఖపట్నంలో 3, ఏలూరులో 1). పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడులోనూ ఇతనిపై కేసులు ఉన్నాయి.

మొత్తంగా అజిత్ సుమారు 94 లక్షల రూపాయల వరకు ప్రజల నుండి కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పలు కేసుల్లో అరెస్టయినప్పటికీ, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ తన పాత వృత్తినే కొనసాగించడం ఇతని నైజం.

విజయవాడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతని వద్ద నుండి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రూ. 37 లక్షల నగదు. 49 గ్రాముల బంగారం. రూ. 50 లక్షల విలువైన ప్రాపర్టీ. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తువులను కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు నగదు బదిలీ చేయవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. భారీ లావాదేవీలు చేసేటప్పుడు ముఖాముఖి కలిసి, వస్తువులను స్వయంగా పరిశీలించిన తర్వాతే డబ్బు చెల్లించాలని సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *