Last Updated:
NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు!
NTR District: గూడు లేని వారికి నీడను అందించాల్సిన గృహ రుణం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు శృతిమించడంతో, అవమానాన్ని భరించలేక భూక్యా హనుమ (42) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భీమలపాడు శివారులోని పెద్ద తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈనాడు కథనం ప్రకారం.. పెద్ద తండాకు చెందిన భూక్యా హనుమ తన కుటుంబం కోసం ఒక పక్కా ఇల్లు నిర్మించుకోవాలని కలలు కన్నాడు. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ రుణాన్ని క్రమంగా చెల్లిస్తూ వచ్చాడు. అయితే, గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదాలు (EMI) సకాలంలో చెల్లించలేకపోయాడు.
ఏజెంట్ల వేధింపులు.. ఇంటి సామాగ్రి జప్తు చేస్తామంటూ హెచ్చరిక
హనుమ బకాయి పడటంతో ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు ఆయనపై ఒత్తిడి పెంచారు. తరచూ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే హనుమను వేధించేవారు. మంగళవారం రాత్రి హనుమ నివాసానికి చేరుకున్న ఏజెంట్లు, తెల్లవారే సరికి రుణం మొత్తం చెల్లించకపోతే ఇంట్లోని సామాగ్రిని బయట పడేసి, ఇంటిని జప్తు చేస్తామని కఠినంగా హెచ్చరించారు.
బుధవారం ఉదయం కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన ఏజెంట్లు, “ఇంకా ఎందుకు ఖాళీ చేయలేదు?” అంటూ హనుమను తీవ్ర పదజాలంతో దూషించారు. అందరి ముందు జరిగిన ఈ అవమానాన్ని, ఒత్తిడిని తట్టుకోలేకపోయిన హనుమ, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
అవమాన భారంతో ఇంటి నుండి బయటకు వెళ్లిన హనుమ, గ్రామ సమీపంలోని మల్బరీ షెడ్లో ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న హనుమను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి భార్య బుజ్జి, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
తన భర్త మరణానికి కారణమైన ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం మరియు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య బుజ్జి ఏ.కొండూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏజెంట్ల వేధింపుల వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై మహాలక్ష్ముడు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రుణాల రికవరీ పేరుతో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు సామాన్యులను వేధిస్తూ ప్రాణాలు తీయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి కంపెనీల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



