Last Updated:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాకలో మౌనిక హత్య కేసులు ఒక్కో నిజం బయటకి వస్తుంది. తాజాగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన విషయం అందరికి షాక్కు గురి చేస్తుంది..
విశాఖపట్నం గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో నిందితుడు రవీంద్రను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించగా, దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మొదటగా మౌనికను రవీంద్ర తన అపార్ట్మెంట్లోనే హత్య చేశాడని పోలీసులు భావించారు. అయితే తాజా విచారణలో అసలు కథ వేరేలా ఉన్నట్టు స్పష్టమైంది.
పోలీసుల వివరాల ప్రకారం, రవీంద్ర తన స్నేహితుడి ఇంట్లోనే మౌనికను హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో పెట్టి తన ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అక్కడ శరీరాన్ని ముక్కలు చేసి, ఆధారాలను నశింపజేయడానికి పలు చర్యలు తీసుకున్నట్లు బయటపడింది. ఈ విషయం బయటపడటానికి ముఖ్య కారణం సీసీటీవీ ఫుటేజీ. రవీంద్ర ఫ్లాట్కు మౌనిక వచ్చినట్లు ఎక్కడా రికార్డులు లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేసి లోతుగా దర్యాప్తు చేశారు.
నేవీలో ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకు మౌనికతో పరిచయం డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడింది. కొంతకాలం స్నేహంగా కొనసాగిన వారి మధ్య విభేదాలు రావడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. మార్చి 29న మౌనికను మర్రిపాలెం నుంచి తీసుకెళ్లానని, తన ఫ్లాట్లోనే గొడవ జరిగి హత్య చేశానని రవీంద్ర తొలుత పోలీసులకు చెప్పాడు. కానీ సీసీ ఫుటేజీలో మౌనిక కనిపించకపోవడంతో కథలో తేడాలు బయటపడ్డాయి.
దర్యాప్తు ముమ్మరం చేయగా, రవీంద్ర తన ఫ్లాట్కు దగ్గరలోనే ఉన్న స్నేహితుడి ఇంటిని ఉపయోగించుకున్నట్లు తెలిసింది. ఆ రోజు ఉదయం స్నేహితుడు ఉద్యోగానికి వెళ్లిన తరువాత, అతని ఇంటి తాళాలు తీసుకున్న రవీంద్ర మౌనికను అక్కడికి తీసుకెళ్లాడు. తనకు ఇప్పటికే పెళ్లయిందని మౌనికకు తెలియకూడదనే ఉద్దేశంతో, ఆ ఇంటినే తన ఇల్లుగా చూపించాడు.
ఆ ఇంట్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మౌనిక గట్టిగా అరవడంతో భయపడిన రవీంద్ర ఆమె నోరు మూసే ప్రయత్నం చేశాడు. అనంతరం మోకాలితో గొంతుపై బలంగా ఒత్తడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన జరిగిన విషయం స్నేహితుడికి కూడా తెలియదని పోలీసులు చెబుతున్నారు.
హత్య అనంతరం రవీంద్ర మృతదేహాన్ని అక్కడే ఉంచి, తన ఫ్లాట్కు వెళ్లి ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ తీసుకొచ్చాడు. తిరిగి వచ్చి మౌనిక శరీరాన్ని అందులో పెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. తరువాత ఆన్లైన్లో కత్తులు, వైపర్, డస్ట్బిన్ కవర్లు కొనుగోలు చేసి, బాత్రూమ్లో శరీర భాగాలను వేరు చేశాడు. వాటిని ఫ్రిజ్లో ఉంచి, తర్వాత జీడితోట ప్రాంతంలో పెట్రోలు పోసి తగలబెట్టినట్లు విచారణలో తేలింది.
పోలీస్ కస్టడీ ముగియడంతో రవీంద్రను కోర్టులో హాజరుపరచగా, అక్కడి నుంచి కేంద్ర కారాగారానికి తరలించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అవసరమైతే మళ్లీ కస్టడీ కోరుతామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



