Last Updated:
చిత్తూరు జిల్లాకు చారిత్రాత్మకంగా రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు. Kuppam ద్రావిడ విశ్వవిద్యాలయం పెరియార్ భవన్ లో 1 నుంచి 5 తరగతుల ప్రవేశాలు ప్రారంభం.
ఏపీలోని చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఇది ఒక చారిత్రాత్మక విజయం. దశాబ్దాలుగా జిల్లాలో ఒక్క కేంద్రీయ విద్యాలయం లేకపోవడంతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన కేంద్ర ప్రభుత్వ విద్యను అభ్యసించాలంటే పొరుగు జిల్లాలు లేదా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో కుప్పంలో విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమైనప్పటికీ, స్థలం ఎంపిక దాటి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఐదేళ్ల కాలయాపన వల్ల జిల్లా విద్యార్థులు ఎంతో నష్టపోయారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ, స్థానిక ప్రజాప్రతినిధుల దూరదృష్టి ఫలితంగా చిత్తూరు జిల్లాకు కేవలం ఒకటి కాదు, ఏకంగా రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. చిత్తూరులోని మంగ సముద్రం వద్ద ఒకటి, కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరొకటి ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంవత్సరం వృధా కాకూడదనే ఉద్దేశంతో తక్షణమే తాత్కాలిక భవనాల్లో తరగతులను ప్రారంభించేందుకు వసతులు మెండుగా ఏర్పాటు చేశారు.
కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ ఆవరణలోని పెరియార్ భవన్ లో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయం తన కార్యకలాపాలను ప్రారంభించింది. దీనికి సంబంధించి వచ్చే విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ పి. దివాకర్ కీలక వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో సీనియర్ టీజీటీగా పనిచేస్తున్న దివాకర్, కుప్పం విద్యాలయ బాధ్యతలను స్వీకరించారు.
ప్రవేశాల వివరాలు ఇలా ఉన్నాయి: ప్రస్తుతానికి ఈ విద్యాలయంలో 1 నుంచి 5వ తరగతి వరకు గల ప్రాథమిక విభాగం మాత్రమే నడుస్తుంది. బాలవాటిక-1, బాలవాటిక-2, బాలవాటిక-3, మొదటి తరగతి (Class 1) ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేవీఎస్ అధికారిక పోర్టల్ https://kvsonlineadmission.kvs.gov.in ద్వారా షెడ్యూల్ ప్రకారం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ తరగతి అంతకంటే పై తరగతులకు ప్రవేశాలు కావాలనుకునే వారు నేరుగా పాఠశాలలో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కేంద్రీయ విద్యాలయాలు కేవలం పాఠ్యపుస్తకాల విద్యకే పరిమితం కాకుండా, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసం, సహపాఠ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాయని ప్రిన్సిపాల్ భరోసా ఇచ్చారు. అర్హత ప్రమాణాలు, వయస్సు పరిమితి, అవసరమైన ధృవపత్రాల వివరాల కోసం తల్లిదండ్రులు విద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



