Last Updated:
మదనపల్లె మణప్పురం రితీ జువెలరీస్ మాజీ మేనేజర్ సూరజ్ చీటీ పథకాల పేరుతో సుమారు 2.5 కోట్లు మోసపుచ్చి పరారైందని ఆరోపణలు, బాధితుల నిరసన, పోలీసు ఫిర్యాదు సిద్ధం
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ మోసం వెలుగులోకి రావడం స్థానికులను కలవర పెట్టింది. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితీ జువెలరీస్ దుకాణంలో మేనేజర్గా పనిచేసిన సూరజ్, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలతో పరారయ్యాడన్న వార్త షాక్కు గురిచేస్తోంది.
తరుగు, కూలీ లేకుండా తక్కువ ధరకే బంగారం అందిస్తామని చెప్పి వినియోగదారులను ఆకట్టుకున్న సూరజ్, చీటీల రూపంలో నెలనెలా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ఈ పథకంలో చేరి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టారు. నమ్మకంతో పెట్టిన ఈ డబ్బులు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేకరించిన డబ్బులను సూరజ్ నకిలీ రసీదులు సృష్టించి తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు సమాచారం. ఇలా సుమారు రూ.2.5 కోట్లకు పైగా వినియోగదారుల సొమ్మును దారి మళ్లించి, చివరికి సంస్థకే మోసం చేసి పరారైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన బయటపడటంతో బాధితులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
చీటీలు పూర్తయ్యాక బంగారం లేదా డబ్బు కోసం వచ్చిన వినియోగదారులకు యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. ప్రస్తుతం బాధ్యతలు చూస్తున్న మేనేజర్ మోహన్ను బాధితులు నిలదీస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము సంస్థపై నమ్మకంతోనే పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు మా డబ్బులు ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
సమాధానం రాకపోవడంతో బాధితులు దుకాణం ఎదుటే నిరసనకు దిగారు. తమ డబ్బులు తిరిగి చెల్లించేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో పట్టణంలో భయం, ఆగ్రహం కలగలిసి కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికాకపోయినా, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మోసం వెనుక మరింత పెద్ద స్కామ్ ఉందా అనే కోణంలో కూడా విచారణ సాగించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటన మదనపల్లెలో భారీ చర్చకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


