Last Updated:
Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి.
Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. ఏది నిజమో తెలుసుకునే లోపే మరో వార్త దర్శనం ఇస్తుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన య్యూటుబర్ పై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS పేర్కొన్నారు.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా లోకల్ యాప్లో “అనంతపురం – రాయదుర్గం వంట గ్యాస్ కొరత… మా ఊరు హోటల్స్ మూతలు అనే శీర్షికతో ఫోటోలతో కూడిన సమాచారం వైరల్ అయిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ వీడియోలో రాయదుర్గం ప్రాంతంలో LPG గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక హోటళ్లు మూతపడినట్లు తప్పుడు ప్రచారం చేయబడిందన్నారు.
ఈ విషయంపై వెంటనే స్పందించిన రాయదుర్గం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా, ఆ వీడియోను పి.అమీర్ బాషా (సోమలాపురం గ్రామం, డి.హీరేహాళ్ మండలం) అనే యూట్యూబర్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు గుర్తించారు. విచారణలో భాగంగా ఆ వీడియోలో ఉపయోగించిన ఫోటోలు రాయదుర్గం ప్రాంతానికి చెందినవి కాకుండా వేరే రాష్ట్రం వేరే ప్రాంతాలలో తీసినవని విచారణలో తేలింది. ఒక మహిళ తలపై గ్యాస్ సిలిండర్ మోస్తూ ఉండటం, సిలిండర్ల కోసం ప్రజలు వేచి ఉన్నట్లు చూపించిన చిత్రాలు రాయదుర్గం ప్రాంతానికి సంబంధించినవి కావని పోలీసులు నిర్ధారించారు.సదరు య్యూటుబర్ పై రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదు… క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS రాయదుర్గం UPS పోలీసు స్టేషన్ అలాగే …రాయదుర్గం ప్రాంతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చేసిన ప్రచారం కూడా పూర్తిగా అసత్యమని తేలిందన్నారు.
రాయదుర్గంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతున్నట్లు సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలు స్పష్టం చేశాయన్నారు. అదేవిధంగా రాయదుర్గం పట్టణంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడినట్లు ప్రచారం చేయడం కూడా పచ్చి అబద్ధమన్నారు. రాయదుర్గం పట్టణంలో హోటళ్లు సాధారణంగా యథావిధిగా నడుస్తున్నాయని విచారణలో వెల్లడైందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అనవసర ఆందోళన, గందరగోళ పరిస్థితులు సృష్టించినందుకు సంబంధిత యూట్యూబర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా వేదికలలో ఎవరైనా అసత్య సమాచారం, పుకార్లు లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు చేయడం, వీడియోలు తయారు చేయడం లేదా ఫార్వర్డ్ చేయడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై భారతీయ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మకూడదని, అధికారిక వర్గాలు లేదా సంబంధిత శాఖల ద్వారా ధృవీకరించుకున్న తరువాత మాత్రమే విశ్వసించాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS సూచించారు.
Anantapur,Anantapur,Andhra Pradesh
Mar 16, 2026 11:21 AM IST



