Last Updated:
నగరంలో వృద్ధ దంపతులు “డిజిటల్ అరెస్ట్” మోసానికి గురయ్యారు. అప్రమత్తతతో నష్టం తప్పింది. పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ సైబర్ భద్రతపై అవగాహన పెంచారు.
నేటి సాంకేతిక యుగంలో మోసాల రూపాలు రోజురోజుకు మారుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మచిలీపట్నంలోని ఈడెపల్లిలో నివాసముంటున్న ఓ విశ్రాంత ఉద్యోగి వృద్ధ దంపతులను ఇలాంటి సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద నష్టం తప్పింది.
శుక్రవారం ఆయనకు ఒక నంబరు నుంచి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు. పోలీస్ యూనిఫాం ధరించి ఉన్న ఓ వ్యక్తి తాను పుణె యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీసీ) అధికారిని అని చెప్పాడు. ఇటీవల తాము అదుపులోకి తీసుకున్న నలుగురు ఉగ్రవాదుల నుంచి హరినాథ్ కు చెందిన ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నామని చెప్పాడు. ఉగ్రవాదులతో పరిచయాలు ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నిస్తూ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాయని రోజంతా మేము చెప్పింది చేయాలంటూ బెదిరించారు. వెంటనే పక్క ఇంటి వ్యక్తి విషయాన్ని పోలీసులకు చెప్పాడు.. రంగంలోకి దిగిన పోలీసు వీడియో కాల్లో కనిపించగా సదరు వ్యక్తి వెంటనే కాల్ కట్ చేశాడు..
సైబర్ నేరగాళ్లు ఇలా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. నిజమైన పోలీసు అధికారులు ఎప్పుడూ ఫోన్లో డబ్బులు అడగరని, అరెస్ట్ ప్రక్రియ న్యాయపరమైన విధానాల ప్రకారం మాత్రమే జరుగుతుందని చెప్పారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారి మాట్లాడుతూ, “డిజిటల్ అరెస్ట్ అనే వ్యవహారం అసలు చట్టంలో లేదు. ఇది పూర్తిగా మోసగాళ్లు సృష్టించిన పదం. ప్రజలు ఇలాంటి కాల్స్కు భయపడకుండా, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా నివసించే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను జాగ్రత్తగా స్వీకరించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదు. అనుమానం వచ్చిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని సూచించారు. ఈ ఘటనతో మరోసారి సైబర్ భద్రతపై అవగాహన అవసరం స్పష్టమైంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, మన అప్రమత్తతే నిజమైన రక్షణ.
భయానికి లోనవకుండా, ధైర్యంగా స్పందిస్తేనే ఇలాంటి మోసాలను అడ్డుకోవచ్చు. ప్రజల సహకారంతో సైబర్ నేరాలను పూర్తిగా నియంత్రించగలమని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితకాల సంపాదనను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే “తెలివిగా ఉండండి – సురక్షితంగా ఉండండి” అనే సందేశాన్ని పోలీసులు మరోసారి ప్రజలకు గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



