Last Updated:
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 90 రోజుల్లోనే దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. 13-16 మధ్య వయసున్న పిల్లలకు ఈ నిర్ణయం వర్తించేలా ఆలోచన చేస్తున్నామని, సోషల్ మీడియాతో నష్టం జరగకూడదన్నదే తమ ఆలోచన అని చంద్రబాబు పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, ఆన్లైన్ వ్యసనాల నుండి వారిని దూరం చేయడం, హానికరమైన అంశాల బారిన పడకుండా రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ వినూత్న ఆలోచనను కర్ణాటక ప్రభుత్వం అమలు చేయడం సంతోషకరమని ఆయన ట్వీట్ చేశారు. డిజిటల్ ప్రపంచంలోని చీకటి కోణాల నుండి యువతను రక్షించడానికి ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. మంచి ఆలోచనలు వేగంగా వ్యాప్తి చెందుతాయని, ఈ దిశగా కర్ణాటక ప్రభుత్వం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ అంశంపై లోతైన అధ్యయనం చేస్తోంది. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమలులో ఉన్న నిబంధనలను పరిశీలిస్తూ, వయస్సు నిర్ధారణ కోసం పటిష్టమైన గుర్తింపు కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా నిలవనుంది.
రాష్ట్ర ఆర్థిక సర్వే 2025-26 నివేదిక ప్రకారం, సోషల్ మీడియా వల్ల విద్యార్థుల ఏకాగ్రత తగ్గడమే కాకుండా సైబర్ బుల్లింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని తేలింది. అందుకే కేవలం 13 ఏళ్ల లోపు వారికే కాకుండా, అవసరమైతే 16 ఏళ్ల లోపు పిల్లలపై కూడా నియంత్రణ విధించే అంశాన్ని మంత్రుల బృందం పరిశీలిస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండటానికి, ఉత్పాదకత పెంచడానికి ఈ చర్యలు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇప్పటికే వివిధ సాంకేతిక సంస్థలు మరియు నిపుణులతో చర్చలు జరిపింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, దీనిని ఒక బలమైన చట్టంగా తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఇటువంటి వయస్సు ఆధారిత నియంత్రణలు ఉండాలని గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ నిబంధనలు అమలులోకి వస్తే, అది చిన్నారుల ఎదుగుదలలో ఒక విప్లవాత్మక మార్పుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



